12/02/2015
పవర్ లేకపోయినా ప్రభ తగ్గలేదు
అట్టహాసంగా టీఎ్సఆర్ మనవడి వివాహ రిసెప్షన్.. హేమాహేమీల హాజరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆయన పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. అయినప్పటికీ ఢిల్లీలో ఆయన హవా తగ్గలేదు. ఆయన మనవడి వివాహంసందర్భంగా మంగళవారం రాత్రి అశోకా హోటల్లో ఏర్పాటు చేసిన విందుకు పలువురు హేమాహేమీలు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మనవడి వివాహ రిసెప్షన్ రాజధాని ఢిల్లీలో పలువురు దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ, అతిరథ మహారథులైన కాంగ్రెస్ నేతలే కాదు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బీజేపీ సీనియర్ నేతలు, త్రివిధ దళాధిపతులు, కేంద్ర కేబినెట్ సెక్రటరీ, వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులు, గవర్నర్లు, సీబీఐ డైరెక్టర్ మొదలైన ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ‘సోనియా తన కూతురు ప్రియాంకాగాంధీనే కాదు, ప్రియాంక కూతురు నిరాలా తోసహా ఈ కార్యక్రమానికి హాజరు కావడం నన్ను ఎంతో ఆనందపరిచింది’ అని టీఎ్సఆర్ ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, గవర్నర్లు రోశయ్య, విద్యాసాగర్ రావు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జైట్లీ, సదానంద గౌడ, రాంజెత్మలానీ తదితరులు హాజరైనట్లు తెలిపారు....